Monday, December 1, 2008

ఈ గడ్డపై ఉగ్రవాదుల శవాల దహనం వద్దు: ముస్లిం కౌన్సిల్

http://www.andhrajyothy.com/latestmainshow.asp?qry=/2008/dec/1new46

ఈ గడ్డపై ఉగ్రవాదుల శవాల దహనం వద్దు: ముస్లిం కౌన్సిల్
తమ వర్గం వారినుంచి ఇటువంటి ప్రతిఘటనలెదురైతే ఎంతటి ఉగ్రవాదులూ (ఏ మతం వారైనా..)వెనకడుగు వేయాల్సిందే. ఇటువంటి సామాజిక ప్రతిఘటన అభినందనీయం.

Saturday, November 29, 2008

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జన్నాన్ని - ఇది నిజంగా మన విజయమా?

తీవ్రవాదులతో పోరాటం ముగిసింది. ఇక పోరాడాల్సింది మన కుళ్ళు రాజకీయ నాయకులతో....ఇంత మారణ హోమంలోనూ ప్రచారానికి వెంపర్లాడే మన రాజకీయ నాయకులు ఆ ఉగ్రవాదులకంటే ప్రమాదం. పరామర్శకు వచ్చే కుహనా నాయకమన్యులను జనం నిలదీసి చెప్పుతో కొట్టే రోజు రావాలి.

కాని అది జరగదు. ఎందుకంటే మన సీతారాములవారన్నట్లు ఈ జనానికి సిగ్గు లేదు. మారణ హోమాన్ని నియంత్రించటానికి ప్రతిగా మరో విధ్వంసకాండను సృష్టించి సహచరుల్ని కోల్పోయిన నిర్వికార పరిస్తితుల్లో బయటకు వస్తున్న సైనికులతో కరచాలనానికి ప్రయత్నిస్తూ జై భారత్ అనటంతోనే వారు దేశ రుణం తీర్చేసుకున్నారు.

"బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?" - అంటూ ప్రశ్నలు సంధించిన ఒక బ్లాగరి ఎంతటి నిష్టూర సత్యాలను ఉదహరిస్తున్నాడో గమనించండి. నిజంగానే ఈ ప్రశ్నలు ఎవరికీ తట్టావా? ఈ ఘటనను మన విజయంగా చిత్రీకరించటానికి ఎవరికైనా ఎలా మనసొప్పుతోందో నాకర్థం కావటం లేదు. ఇటువంటి అల్ప విజయాలను సంబరంగా జరుపుకొని జబ్బలు చరుచుకుంటే ఈ ముష్కరుల ఆగడాలు ఎన్నటికీ ఆగవు.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జన్నాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరేమైపోనీ ని

గాలివాటు గమనానికి కాలిబాటదేనికీ
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికీ ?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాటం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావకాష్టం
కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం ని

పాతరాతి గుహలు పాల రాతి గుహలైనా
అడివి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ ని

Wednesday, October 15, 2008

మన రాజకీయాలెందుకు ఈ విధంగా తగలడ్డాయి?

మన రాజ్యాంగ నిర్మాణం ప్రకారం ఒక రాజకీయ పార్టీ మనుగడకు మరే ఇతర విషయాలకన్నా ప్రజాదరణే కీలకాంశం. ఇటువంటి నిర్మాణంలో నేతల నిబద్దతే రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. మన దేశ ప్రజలలో అత్యధికులు నిరక్షరాస్యులు. అక్షరఙ్ఞానం ఉన్నా రాజకీయ చైతన్యం లేనివారు. అమాయకులు. మన నాయకులు మొదట్లో ప్రజాదరణ కోసం మంచి మార్గాలనే అనుసరించినా క్రమంగా ప్రజల అనేక బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని మరింత బలహీనపరుస్తూ వారిని ఎటువంటి అన్యాయమైనా సహించేలా, ఉదాసీనత వహించేలా మార్చేసారు. గతంలో ప్రజలు తనకు ఎరుకలో వున్నవారికి అన్యాయం జరిగేంతవరకు సహించేవారు, కాని ప్రస్తుతం తనదాకా వచ్చినా తేల్చుకోలేని స్థితిలో వున్నారు. ప్రజలను ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని సందిగ్దావస్థలోకి నెట్టేసారు. ప్రజలు ఈ సందిగ్దావస్థలో వుండగానే మరో కొన్ని దశాబ్దాలపాటు నిరాటంకంగా దోచుకుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో స్థాపించబడిన లొక్ సత్తా లాంటి పార్టీలు సిద్దాంతపరంగా దేశంలోని యువకులను ఊరించినా కార్యశీలత పరంగా ఇతర పార్టీలను ఎదుర్కొనే స్థాయిలో లేదన్నది నిరాశ పరిచే వాస్తవం. దీనికి అసలు కారణం సుషుప్త/సందిగ్ధావస్తలో ఉన్న ప్రజలను తగిన మోతాదులో ఆకర్షించక పోవటమే. ఏ కొద్దిమందికో(కాని నిర్ణాయక శక్తి ఇదే) తప్ప మన దేశం/రాష్ట్రం లోని అత్యధిక శాతం ప్రజలకు రాజకీయ విధానాలను అర్థం చేసుకుని నేతలనెన్నుకునేంత పరిణితిలేదన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మెజారిటీ ప్రజలు తమ పరిధిలోని స్వల్పకాలిక ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. స్వాభావికంగా నిర్ణాయక శక్తిని సిద్దాంత నిబద్దత కలిగిన పార్టీలు ఆకర్షించగలిగినా ప్రాధాన్య వోటును సంపాదించటానికి సిద్దాంతాలు సరిపోవు. రాజనీతిని ప్రదర్శించగలగాలి. రాజకీయ నిర్ణయాలను అమలుపరచగల కార్యసాధకులను ఆకర్షించడమో పెంపొందించడమో చేయాలి.

ప్రజారాజ్యం లాంటివి చేస్తున్న పని ఇదే. వారికి సిద్దాంతాలమీద అవగాహన లేదు. కాని ప్రజాకర్షణతో ప్రాధాన్య వోటును సులభంగా పొందుతారు. కార్య సాధకులనూ ఆకర్షిస్తున్నారు. వీరికి నిర్ణాయక శక్తిని ఆకర్షించే సిద్దాంతాలు లేకపోవడం పెద్ద లోటు. అయినప్పటికీ కొత్త పార్టీ కనుక, మరో మెరుగైన ప్రత్యామ్న్యాయం లేదు కనక కొంత నిర్ణయాత్మక వోట్లు వీరికి పడే సంభావ్యత వుంది. బహుముఖ పోటీలో అధికారాన్నీ సాధించవచ్చు. అధికార సాధన తరువాత ఇటువంటి పార్టీ నేతలు ప్రదర్సించే నిబద్దతను బట్టి అవి ప్రత్యేకతను సంతరించుకోవడమో లేక మరో మూస పార్టీగానో మిగిలిపోతుంది. చరిత్రను గమనిస్తే ఎందరో ఉత్తమ నాయకుల అధికార సాధనాపర్వంలో విలక్షణత దుర్లక్షణాలుగా రూపంతరం చెందడం అనుభవమే.

దేశ ప్రగతికి సిద్దంతాలు, నిబద్దత ముఖ్యమైనా అధికార సాధనకు కీలకాంశం ప్రజాకర్షణ. ప్రజాస్వామ్యంలో ప్రజలకంటే విలువైనది ఆ ప్రజలిచ్చే అధికారం. సిద్దాంత నిబద్దత కలిగిన నాయకులు రాజకీయ పరిణితిని ప్రదర్శించి దేశానికి నష్టం కలిగించని ప్రజాకర్షక నిర్ణయాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో మేధావులైన యువకులకు లోటులేదు. కళాశాల స్థాయిలో రాజకీయాలపై చర్చను లేవదీస్తే మన దేశమెదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొండం అసాధ్యమేమీ కాదు. ప్రజలను ఆకర్షించటంలో చతురతను విధానాల ప్రకటనలో నిబద్దతను చూపిస్తే ఉత్తమ రాజ్యంగా ఎదగడం కష్ట సాధ్యమే.

Tuesday, August 26, 2008

భారత సంసృతి నీచమైనదా?

ఈ మధ్య ఎదో ఒక సాకుతో స్వీయ నిందకు పాల్పడటం ఎక్కువయిపోయింది. ఇది ఒక అభ్యుదయవాదంగా చలామణి అవుతోంది. పర సంస్కృతీ పీడలను అరువు తెచ్చుకోవటం అభ్యుదయ వాదమా? ఇతరులు దేనినైతే వద్దనుకొంటున్నారో మనం దానిని అభ్యుదయవాదం పేరుతో దిగుమతి చేసుకోవలనుకుంటున్నాం.
కాస్త ఆలోచించండి. మనలో, మన సంస్కృతిలో మంచేలేదా? ఎందుకీ పర వ్యామోహం? లోపాలులేని సంస్కృతి ఏది? వాటిని బూచిగా చూపి ఇతరుల్లోని చెడును ప్రోత్సహించటం ఎంతవరకూ సబబు. విమర్శలు అహ్వానించదగినదే వితండవాదం కాదు.
మొత్తంగా చర్చిస్తే ఒక గ్రంధమే అవసరమౌతుంది . ఒక టపాలో జరుగుతున్న చర్చను గమనించండి.
శంఖారావం లోని ఒక టపాలో జరిగిన చర్చను చూడండి. దానిలో నా సమాధానం ఇక్కడ ఇస్తున్నాను.


భారతదేశ దౌర్భాగ్యానికి అసలు కారణం అత్మపరిశీలన పేరుతో ఆత్మనింద చేస్తూ మూర్ఖంగా వాదిస్తున్నవారే. వీళ్ళు రాజకీయనాయకులకన్నా ఉత్తములు. మన సంస్కృతిని నిందించటంలో వీరికొక విజయగర్వం వుంటుంది. దీనీతోనే వీళ్ళూ గొప్పవాళ్ళమైపోయామని భావిస్తారు. మనలోని మంచికి మినహాయింపులను ఉటంకిస్తూ అదే మన సంస్కృతన్నట్లు ప్రచారం చేస్తారు. ఇతరుల దౌర్భాగ్యాపు పనుల్లో మంచిని వెదకి ఉత్తములనిపించుకుంటారు. వీరికెపుడూ దూరపు కొండలు నునుపే. పోనీ నున్నగా వున్నాయికదా అని దగ్గరికెళ్ళి పరిశీలించరు. ఇటువైపునుడే శల్యసారధ్యం చేస్తుంటారు.

"ఒకనాడు శృంగారం విషయంలో, చాలా క్యాజువల్�గా వున్న మనం, తర్వాత దాన్ని అవసరానికి మించి నిషేధించినట్ట్లు అనిపిస్తుంది. దాని విషయంలో సభ్యత కోసం కొన్ని నిధినిషేధాలు వుండవలసిందే "
-->ఇది సంపూర్ణంగా అంగీకరించాలి. మన సంస్కృతిలో శృంగారం కొన్ని హద్దులకు లోబడి క్యాజువల్గా ఉండాలని చెప్పారుకాని విచ్చలవిడితనాన్ని ప్రోత్చహించదు. నైతిక విలువనాపాదించటం ఆ క్రమంలోనిదే.

"ఒకపక్క వంద కోట్ల జనాభా కనపడుతుంటే, మరో పక్క అదేదో దొంగచాటుగా చేయవలసిన పనిగా మనం భావిస్తుంటే, దాన్ని ద్వందప్రవృత్తిగానే భావించాలి." --> ఇది ఖండించతగినది. ఇది తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్ని పనులు నలుగురిలో చేయవచ్చు. కొన్ని నాలుగు గోడల మధ్యే వుండాలి. ఆలోచించండి. ఇది ద్వందప్రవృత్తి కాదు. అసలు సిసలు పరిణితి.

"తమ తమ శరీరాల గురించి, శరీర సంబంధాల గురించి కనీస విజ్ఞానం ఎంత మంది తలిదండ్రులు వారి పిల్లలతో మాట్లాడ గల్గుతున్నారు?" --> నాకు తెలిసి ప్రతి(కనీసం మెజారిటీ) అమ్మా తనకూతురుతో ఈ విషయాలు చర్చిస్తుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో.

"."మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి" అన్నట్లుంది మీ వివరణ.కామసూత్ర మనదేశంలో పుడితే ఏం? ఖజురహో మనదేశంలో ఉంటే ఏం? ప్రస్తుతం మనదేశంలో శృంగారం "పాపం" ఇంకా చెప్పాలంటే "అపరాధం"." --> ఎవరు చెప్పారిలా? మన సంస్కృతి ఎలా వక్రీకరింపబడుతోందో చెప్పటానికి ఇది అసలైన ఉదాహరణ.ఇలా భావించి వుంటే ఈ దేశంలో పెళ్ళీళ్ళే జరుగవు. మనం అపరాధం అనేది హద్దులు మీరిన శృంగారాన్నే. వయసుకు మించిన ఆలోచనలనే. వయసెందుకు ప్రధానమంటే వయసుతోనే విచక్షణ కలుగుతుంది. మహేష్ గారూ, మీ సామెతను ఇతరవిషయాలకు కూడా విలోమంగా అన్వయించండి. చాలా సార్లు మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్నెందుకు నిందిస్తారు.

"అడ్డమైన వేషాలు వెయ్యబట్టే... ఇపుడు అడ్డమైన రోగాలు వస్తున్నాయి. మన ఋషులు, వారి సంప్రదాయాలు పాటించడం మంచిది. ఎయిడ్స్ వల్ల మన శరీరధర్మం గురించి తెలుసుకోవాలి అన్నారు. అసలు ఎందుకు వచ్చింది. ఒళ్ళు కొవ్వెక్తి చేసేపనుల వల్లేగా..." --> ఇందులో నిజం లేదా? prevention is better than cure అదే మన సంస్కృతి నేర్పుతున్నది. దానికి పెడార్థాలు తీయవద్దు.

"విచ్చలవిడితనంవల్ల AIDS రాదు. రక్షణ లేకపోతే వస్తుంది.ఇది విలువలకి సంబంధించిన విషయం కాదు.ఆరోగ్యానికి సంబంధించిన విషయం.కాబట్టి ఇక్కడ value judgement లు మాని మానవత్వాన్ని ప్రదర్శించండి.AIDS Sex ద్వారా రాదు. unprotected sex ద్వారా వస్తుంది. ఇందులో మీరు ఉద్భోధించే విలువలకన్నా, అజాగ్రత ముఖ్యకారణం." --> విలువలకు మించిన రక్షణా ఎన్నటికీ మీకు దొరకదు. రక్షణతో కూడిన విచ్చలవిడితనం AIDS నిర్మూలించబడుతుందని నమ్మితే మీరు మనిషి తత్వాన్ని తక్కువ అంచనా వేసినట్లే. unprotected sex ద్వారా మాత్రమే AIDS రాగలదనే మీ అపోహను ఏమనాలి?

" ఏ విషయంలోనైనా సత్యాన్ని దర్శించాలంటే ‘విశ్వాసం ’, ‘ఋజువు ’, ‘హేతువు ’ అనే మూడు కోణాల్లో పరిశీలించాలి. కానీ మీరు ‘హేతువు ’ అనే ఒకే ఒక్క కోణం మీదే ఆధారపడుతున్నారు. ఇలా అయితే మీరు వాదమేమో గానీ ‘వాదన ’ మాత్రం బాగా చేస్తారు." --> అఖరాలా నిజం. ఉత్త హేతువాదులంతా మూర్ఖ శిఖామణులు.

Tuesday, August 12, 2008

అభినవ్ - స్తిత ప్రఙ్ఞత

అభినవ్ కు అభినందనలు.


అభినవ్ ఒక మంచి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. మన దేశ స్థాయితో పోల్చుకుంటే అతడు సాధించింది అపూర్వం, అనితర సాధ్యం. కాని అతని ప్రవర్తనలో ఆ స్తాయి గర్వం కనిపించలేదు. నింపాదిగా తన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. పిచ్చిగంతులు వేయలేదు. అవసరానికన్నా కొంచం తక్కువగానే స్పందిచాడు. పెద్దగా సంచలన వ్యాఖ్యలేవీ చేయలేదు. తన విజయగర్వంకంటే భవిష్యత్తులో భారత విజయగీతికనే అకాంక్షించాడు. తన విజయం ఇతరుల్లో స్పూర్తి రగిలించాలని కోరుకున్నాడు.


మరో ప్రతిభాశాలిని మునగచెట్టెక్కించేందుకు కలిగిన సదవకాశానికి(సంచలనానికి) గండిపడటం మీడియాకు రుచించక పోయినా, ప్రస్తుతం ఈ నిగ్రహాన్ని విజయాన్ని కలగలిపి అతడిని మునగచెట్టు ఎక్కించటానికి విపరీతంగా శ్రమిస్తున్నారు.


ఒక పుట్టు సంపన్నుడిగా(భారతంలో చాలా సార్లు ఇది నేరంతో సమానం), ఉన్నత విద్యావంతుడిగా, ఒక సంస్థకు అధిపతిగా ఇటువంటి భావోద్వేగాలకు, నడమంత్రపు సిరి కలిగించే ఉన్మత్తానికి అతీతంగా వుండగలడనే ఆశిద్దాం. డబ్బు అతనికి కొత్తేమీ కాదు కాని కొత్తగ వస్తున్న కీర్తి శిఖరంతోనే జాగ్రత్తగా మెలగాలి.


లేకపోతే మనం సానియా, కాంబ్లి, మల్లీశ్వరి, రాథోడ్ లాగా ఆణిముత్యాలను కోల్పోవలసి వస్తుంది. అప్పుడప్పుడు కనిపించే ఈ మెరుపులను ఒడిసిపట్టి మన నైపుణ్యాలకు సాన పట్టాలే గాని, వారిని తేరుకోలేనంత ఉద్విఙ్ఞానికి, అందుకోలేనంత ఎత్తుకూ తరిమేసి, విఫలమైనప్పుడు అగాధానికి తొక్కేయటం సబబు కాదు.


అభినవ్ కు వచ్చి పడుతున్న ప్రశంసలు, బహుమానాలు మంచిదే కాని, వాటిని గుత్తగుంపగా అతనొక్కడికి మాత్రమే అంచించకూడా తగినన్ని నిధులు ఏర్పాటు చేసి ఇతర క్రీడలకూ వసతులు, సాంకేతిక సహకారాన్ని పెంచాలి. ఇటువంటి సందర్భాలలో, అతణ్ణీ తగురీతిలో సత్కరించటంతో పాటు, అతనీ క్రీడా విభాగానికీ(వీలును బట్టి ఇతర క్రీడలకూ) తగినంత వసతులు కల్పించాలి. ప్రస్తుతం అనేకమంది చిన్నారులు అతని విజయంతో స్పూర్తి పొంది వుంటారు. ఈ వాతావరణాన్ని మనం సొమ్ము చేసుకోవాలి. క్రీడలకు సంభందించిన వసతులను అక్కడక్కడా ఏర్పాటు చేసి, శిక్షణనివ్వాలి, మెరికలను గుర్తించి మెరుగు పరచాలి. ఈ స్పూర్తితో అందరినీ కనీసం ఒకమెట్టు అధికంగా ఎక్కేందుకు ప్రోత్సహించాలి. పాఠశాలల్లో తగినంత వసతులు కల్పించి పోటీ వాతావరణాన్ని కలిగించాలి.


ఎటువంటి స్పూర్తినైనా, ఎంతటి ఉత్తేజాన్నయినా నిర్వీర్యం చేసే శక్తి సామర్థ్యాలు మన రాజకీయనాయకులకు (రాజకీయ)ఉగ్గుపాలతో నేర్చిన విద్య. ఎక్కడైనా డబ్బులుగానీ, ఓటు బ్యాంకు గాని కనిపిస్తే దాన్ని పిండి చేసి పిప్పితీసేవరకూ వారు నిద్రపోరు. ప్రస్తుతం హాకీ, క్రికెట్టుకి పట్టిన/పడుతున్న దుర్గాతి వారి నిర్వాకం ఫలితమే.


ఇటువంటి సందర్భంలో మీడియా పాత్ర ఎనలేనిది. ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకొని కొంతమంది క్రీడాకారుల(వారి ప్రేయసీ/ప్రియుల) వెంటపడటంకన్నా , మన పాఠశాలల క్రీడా పరిస్థితిని అధ్యనం చేసి వారి మద్య పోటీతత్వాన్ని పెంచే సర్వేలను నిర్వహించవచ్చు. ర్యాంకులతో ఊదరగొట్టే పాఠశాలల/కళాశాలలకు, క్రీడల/ఇతర కళాప్రదర్శనపై ఉన్న ఆసక్తిని బట్టి ర్యాంకులను ప్రకటించవచ్చు. సందర్భానుసారం ఇవికూడా తగినంత సంచలనాన్ని రేపుతుంది. విద్యాసంవత్సర ప్రారంభంలో ఇటువంటి వాటిద్వారా అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులూ మారుతారు. పిల్లలకు క్రీడల అవసరంపై/ప్రాధాన్యంపై ఇప్పటి తరానికి చెందిన తల్లిదండ్రులకు తగినంత అవగాహన వుంది కాబట్టి మనం అంతగా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు యంత్రంగాలకు తగిన సూచనలందించవచ్చు.

Friday, August 8, 2008

తెలుగు: మననం-మధనం

నేను-తెలుగు:


తెలుగుతో సాహిత్యంతో నా పరిచయం ఓం నమః శివాయః తో మొదలైంది. ఇక అప్పటినుండి ఆ ప్రస్థానం అలా సాగుతూనే వుంది.


రెండవ తరగతిలోనే నాకు ఓ మోస్తరుగా చదవటం వచ్చేసింది. మా నాన్న తెచ్చిన పుస్తకాలన్నిటినీ ఒకటిరెండు రోజుల్లో చదివి 'పారేసే' అలవాటు అప్పటినుందే మొదలైంది.


మూడవ తరగతినుంచి వార్తా పత్రికలు చదవటం మొదలెట్టాను. 'ఫాంటం' కథతో నాకు ఈనాడుతో సాన్నిహిత్యం మొదలైంది. 'టూకీగా', 'శ్రీధర్ ఇదీ సంగతి ' మొదటి పేజీ లో అప్పుడప్పుడూ కనిపించే పెద్ద కార్టూన్, ప్రధాన వార్థల హెడ్ లైన్స్, ఇలా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చేశాను. తదనంతర కాలంలో మరే పత్రికా నన్నింతగా ఆకర్షించ లేకపోయాయి. ఇక ఇండియా టుడే తెలుగులో వెలువడ్డ తరువాత నేను దానికి వీరాభిమానినైపోయాను.ఇదికాక చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి కథల పుస్తకాలు, యండమూరి, పానుగంటి, మధుబాబు నవలలు తెలుగుతో అనుభందానికి ఎంతగానో తోడ్పడ్డాయి.


ఇక చదువుల విషయానికి వస్తే, నేను పదవ తరగతి వరకూ తెలుగులోనే చదవగలిగాను. నా జీవితంలో పునాదులు పటిష్టంగా వుండటానికి ఇది ఎంతగానో ఉపకరించిందనటానికి సందేహం లేదు. ఇంగ్లీషు, హిందీ, సంసృతం లాంటి భాషలు నేర్చుకునేటపుడు నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కాని వాటి లోని వైవిధ్యాలను, సారూప్యతలను అర్థం చేసుకునే క్రమంలో నా మెదడు చురుకుగా తయారయింది. మనదేశ విద్యార్థులు ప్రతిభావంతులుగా మన్ననలందుకోవడానికి బహు భాషావిధానం ఒక కారణమని నేను గట్టిగా నమ్ముతాను.


తెలుగు - ఒక భాష:


దేశభాషలందు తెలుగు లెస్స అనీ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటుంటారు కాని అదెంతవరకూ నిజమో నాకు తెలియదు. కాని తెలుగులో అనేక ప్రత్యేకతలున్నాయి. చందస్సులు, సంధులు, సమాసాలు, విభక్తులు మన భాషకు రంగులద్దాయి. అవధానం తెలుగు సాహిత్య ప్రక్రియకే తలమానికం. ప్రస్తుతానికి ఏ కొద్దిమందొ అవధానాలను నిర్వహిస్తున్నా ఇది అవసాన దశలో వుందన్నది కాదనలేని నిజం.


తెలుగు - సమాజం:


ఇది పూర్తిగా నిస్పృహ కలిగించే విషయం. ఒక సంఘం గా మనమెపుడూ సంఘటితత్వాన్ని ప్రదర్సించలేదు. ఎక్కడైనా ఇద్దరు తెలుగు వారు వుంటే అక్కడ కనీసం మూడు ముఠాలుంటాయి. మనదేశంలో ఇద్దరు కల్సినపుడు ఇంగ్లీషు మాట్లాడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తెలుగు వారవటానికి అవకాశం చాలా వుంది. మరొక అవలక్షణం ఆత్మ నింద పర స్తుతి. ఇక పిల్లలకు మనం 'మమ్మీ డాడీ' సంస్కృతినే అలవాటు చేస్తున్నాం.


మనం మారాలి. మారటమంటే రోడ్లెక్కి సూచన పలకలను(సిగ్న్ బోర్ద్) తెలుగులోకి మార్పించటమో, ప్రాచీన హోదా కావాలనటమో, రీమేక్(పునఃనిర్మాణ) చిత్రాలకు అధిక పన్నులు వసూలు చేయాలని నిర్భందించటమో కాదు. మీ పిల్లలకు కనీస తెలుగును పరిచయం చేయండి. కనీసం వార్తా పత్రికలను చదివేంత అవకాశాన్ని కల్పించండి. ప్రాధమిక విధ్యలో తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగానైనా వుంచండి. ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి. బయటకూడా అవసరమైనంత వరకే ఇతర భాషలను ఉపయోగించండి.


మరొక్కటి మరువకూడదు, తెలుగును సమర్థించటమంటే ఇతరులను కించపరచొద్దు. తెలుగును మీకు అవకాశమున్నప్పుడల్లా మోతాదుకు మించకుండా వినియోగించండి.

గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనించండి.

Wednesday, August 6, 2008

ఆత్మవిశ్వాసమంటే ఇదీ..


నాగ నరేష్ అని ఒక కుర్రాడికి (కాకతాళీయంగా తెలుగు వాడు) ఈ మధ్య గూగుల్ లో ఉద్యోగం దొరికింది. దీనిలొ ప్రత్యేకత ఏంటంటే, చిన్న తనంలోనే ఒక ప్రమాదంలో రెండు కాళ్ళూ పూర్తిగా కోల్పొయినా పేదరికాన్ని జయించి అకుంఠిత దీక్షతో గూగుల్ దాకా చేరటం సామాన్యమైన విషయం కాదు.


మరొక ప్రత్యేకత ఏంటంటే అతనికి తన చుట్టు ఉన్న ప్రపంచం ఎంతో మంచిదిగా కనబడటం.. అతని మాటల్లోనే ఆ కథను చదవండి. (అనువదిస్తే భావం చెడుతుందేమోనని లంకెను వుంచుతున్నాను)

Tuesday, August 5, 2008

గర్భస్థ శిశువును ఎప్పటిలోగా చంపవచ్చు?

చట్ట ప్రకారం కొన్ని కారణాలపై 20 వారాల వరకు. యధా ప్రకారం చట్టం ఎంత కట్టుదిట్టంగా వ్రాయబడినా/వ్రాయ దలచినా మన పండితులు దానిలో కనీసం లక్ష లొసుగులను పట్టుకోగలరు. ప్రస్తుతానికి మన చట్టం గురించి అందులోని లోపాలగురించి చర్చింటం ఇక్కడ వుద్దేశ్యం కాదు.

సృష్టిలో మానవ జీవితంకంటే సంక్లిష్టమైనది మరొక్కటి లేదని నేను భావిస్తాను. మన సిరివెన్నల గారన్నట్లు 'నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా'. ఒక మనిషి సృష్టి అమ్మ నాన్నల విచక్షణతో(కొన్ని సార్లు నిర్లక్ష్యంతో, ప్రమాదవశాత్తూ) ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. కొత్త ప్రపంచంలోకి అడుగిడటానికి నిరంతరం శ్రమిస్తూ, శ్రమ పెడుతూ ఎంతో అయోమయంతో ఎదురుచూస్తుంటుంది. ఇంతటి అయోమయంలోనూ వెచ్చటి అమ్మ కడుపులో భరోసాగా చిందులేస్తుంది. అంతటి భరోసాతో వున్నప్పుడు ఒకరోజు అమ్మ(అప్పటికి తనకు తెలిసిన మరో ప్రాణం) తనను చిదిమేస్తే విలవిలలాడుతూ తనకు తెలిసీ తెలియకనే (మళ్ళీ తన ప్రమేయం లేకనే) ప్రాణాలు విడుస్తుంది. ఇదే విధంగా సాగుతుందా ఆ చిన్నారి ప్రాణి ఆత్మఘోష?

అమ్మ విషయానికి వస్తే, తనలాంటి మరో ప్రాణికి జన్మనివ్వబోతున్నాననే ఉద్విఘ్నతతో ఈ ప్రపంచాన్నే మరచిపోయి ఆ శిశువుతో కబుర్లాడుతుంటుంది. తన రక్తం పంచుకుని ఎదుగుతున్న ఆ చిన్నారిపై కోటి ఆశలు పెట్టుకుంటుంది. ఆ శిశువు యొక్క ప్రతి అణువూ తనలో ఎదుగుతూ చేస్తున్న ప్రతి కదలికనూ తనివితీరా ఆస్వాదిస్తుంది. తనలోని మరో ప్రాణానికోసం తన ప్రాణమైనా ఫణంగా పెట్టడానికి సిద్దమవుతుంది. ఇటువంటి క్షణంలో ఆ బిడ్డ పుట్టిన తరువాత ఎదో లోపంతో వుంటాడని(సాధారణ జీవితం గడపలేదని) తెలిస్తే ఆ తల్లి హృదయఘోష ఏ దేవునికి అర్థమవుతుంది? లోపంతో వున్న బిడ్డకు జన్మానివ్వాలో కడుపులోనే కడతేర్చాలో నిర్ణయించుకోవలసి వస్తే, ఎంతటి దారుణమీ సృష్టి?

ఇక సమాజం(ప్రభుత్వంతో సహా) దేనిని సమర్థించాలి? శిశువు ప్రాణాన్నా? చంపాలనే అమ్మ కడుపుకోతనా? ఎపుడు సమర్థించాలి 20 వారాల ముందైతే ఫర్వాలేదా? తరువాతైతే నేరమా? ఎలా? అదేదో చానెల్ వారన్నట్లు మన దేశ పరిస్థితులను(వికలాంగులకు అనువైన పరిస్థితులు, సరైన సప్పొర్టు సిస్టం మనదేశంలో లేవట) దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలా? లేక ఎన్నికలు జరిపి ప్రజాభిప్రాయం ప్రకారం నడచుకోవాలా?

ఎందుకీ సృష్టి, ఎవరికోసం ఇలా జరుగుతోంది? కడుపులోని పిండం అరొగ్యాన్ని గుర్తించగలిగే మానవుని పరిఙ్ఞానికి సంతసించాలా? అదే మానవుడు తనకు కావలసిన పరామితులతో పిండాన్ని సృష్టించగలిగే పరిణామాలను ప్రోత్సహించాలా? అటువంటి పరిస్థితి వస్తే ఎనాటికైనా ప్రపంచంలోని ప్రతి మనిషీ(మర మనిషి!) ఒకే జన్యు సూత్రంతో ప్రయోగశాలల్లో పుడతాదేమో? అమ్మ, నాన్నల అవసరం వుండదేమో? మరి మానవ జీవిత వైవిధ్యం ఏమవుతుంది? వైవిధ్యం లేకపోతే ఏమవుతుంది? అపుడెందుకీ సృష్టి? ఎవరు చెప్పగలరీ ప్రశ్నలకు పరిష్కారాలు(సమాధానాలు కాదు)?

నాకు మతి భ్రమించిందంటారా? నిజమేనేమో!! భ్రమించకపోతే నేను మనిషిని కానేమో!!

Sunday, July 27, 2008

ఉగ్రవాదం - ఎలా నియంత్రించటం?

ఈ ప్రశ్న ఆలోచించవలసింది ఎవరు?

పోలీసులా, దేశనేతలా, సైనికులా, ఉపాధ్యాయులా, తల్లి తండ్రులా, మొత్తం ప్రజానీకమా? ఎవరు దీనికి భాద్యులు? ఎందుకిలా చేస్తున్నారు? ఏమిటి దీనికి పరిష్కారం? పోలీసులు, మన నిఘావ్యవస్థ దీన్ని నియంత్రించ గలుగుతుందా? నియంత్రిస్తే ఎంతవరకు నియంత్రించగలుగుతుంది?

ప్రజలకు(మనలోని ప్రతిఒక్కరికీ) తమమీద తమకు నియంత్రణ లేకపోతే పోలీసులేకాదు, ఆ దేవుడే దిగివచ్చినా పూర్తిగా ఇటువంటి అఘాయిత్యాలను ఆపడం కష్టం.

మొదట ఇటువంటి హింసాత్మక చర్యలకు కారణమేంటంటే, సమాజం మీద కాని, సమాజం లోని ఒక భాగం మీద కాని అనేక కారణాలతో కసి పుట్టిన కొంతమంది ఇతరులపై దాడికి తెగబడటం. దురదృష్టవశాత్తూ వీరు గతంలో అణగదొక్కబడినవారుగా గానీ, అణగదొక్కబదుతున్నారని భావిస్తున్న వారుగా గాని వున్నారు.

మన దేశానికి సంభందించినంత వరకూ, నక్సలైట్లూ, ఇతర విప్లవ గ్రూపులు, విదేశీ ఉగ్రవాదం కారణాలుగా ఉన్నాయి. గతంలో, మన సమాజనిర్మాణం, వృత్తులను బట్టి వివిధ కులాలుగా విభజింపబడ్డాయి. కాని వీటిలో అగ్ర, నిమ్న కులాలని మరో విభజన తేవడం ద్వారా సాంఘిక అసమానతలకు తద్వారా కొన్ని దురాచారాలు ఏర్పడి సమాజం లోని ఒక భాగం అణగద్రొక్కబడింది. ఇటువంటి విభజనలు ఈ ప్రపంచంలోని ప్రతి సమాజంలోను వున్నాయి. ఇవి ఇలాగే కొనసాగినంత వరకూ ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదు. కాని, కొంతమంది పెద్దలు ఈ అసమానతలను గుర్తించి చక్కదిద్దటం మొదలు పెట్టి, సమాజం మార్పు చెందటానికి సిద్దపడుతున్న తరుణంలో సదరు అణగద్రొక్క బడిన వర్గంలోని కొందరు గతంలో జరిగిన అన్యాయాలకు పగ తీర్చుకోవాలని భావించినపుడే ఇటువంటి ఉగ్రవాద చర్యలకు ఆస్కారం ఏర్పడుతుంది(ఇటువంటి భావనకు, కొంతమంది నన్ను నిందించవచ్చు కాని, ఇది అంగీకరించవలసిన విస్మరించలేని నిజం). ఇటువంటి పగ వున్నవారు, తమకు అనుకూలమైన వాతావరణం కనుపించగానే, అవకాశం దొరికినప్పుడల్లా, ఎదుటివారికి వారిలాగానే అన్యాయం తలపెడతారు. దీనితో ఇటువైపు వర్గం వారి అహం దెబ్బతిని ప్రతిచర్యలకు దిగుతారు. దీనివల్ల సదరు విద్వేషాలు పెరుగుతాయే కానీ, పరిష్కారం ఎక్కడ? ఇద్దరిలో వున్న తేడా ఏంటి? ఎదుటివారిని, వారి పూర్వపు చర్యలను నిందించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బలం పెరిగినప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా వున్నపుదు, వారిని క్షమించు. నీకు అన్యాయం చేసినవారు పశ్చాత్తాపంతో దహించుకుపోవటమే కాదు, మళ్ళీ ఏ సందర్భంలోనూ అటువంటి తప్పులను పునరావృతం కానివ్వరు.

వైరాగ్యంగా అలోచిస్తే, అసలు ప్రపంచంలో, ప్రకృతిలో అసమానతలు లేని ఒక సందర్భం ఏది? ప్రకృతిలోని ఏ రెందు వస్తువులు కాని, విషయాలు కాని, వ్యక్తులు కాని ఒకటెలా అవుతాయి? అంతెందుకు, మన చేతిలోని ఐదు వేళ్ళు సమానం కావే!! ఎడమకంటికి కుడికంటిమీద కోపం వస్తే ఎలా? కుడికంటికి ఆధిక్యభావం వుంటే అది అర్థరహితం కాదా? సృష్టిలోని ఏ రెండు ఒక్కటి కాజాలవు. రెండు ఒక్కటి కాగలిగితే ఆ సృష్టే అనవసరం. దేనికదే వైవిధ్యంగా వుండవలసిందే. కాని సమస్య ఎక్కడంటే, ఏ ఒక్కదాన్నొ అధికంగానో, అధమంగానో భావించటమే. ప్రతి సృష్టికీ దేనికదే ఒక ప్రత్యేకత, పరమార్థం వుంటుంది. మనం దానిని గమనించి నడచుకోగలిగితే చాలా వరకు అసమానతలు తొలగిపోతాయి.


ఇక ఆచరణా మర్గానికి వస్తే,
1. ఇంట్లో

  • భర్త, భార్యని గౌరవించాలి. ఒకరినొకరు అవమానించే సందర్భాలను తగ్గించుకోవాలి.
  • కొడుకుకూ, కూతురికీ మద్య పెంపకంలో వివక్ష చూపొద్దు.
  • పిల్లల మద్య నున్న అసమానతలను కించపరచవద్దు.
  • కోడలికీ, కూతురికీ/కొడుకుకూ వివక్ష చూపొద్దు.
  • అత్త మామలకు, తల్లిదండ్రులకూ భేదం చూపొద్దు.
  • పిల్లలకు క్షమాగుణాన్ని, ఓర్పును, పెద్దల పట్ల మర్యాదను నేర్పండి.

2. ఇంటిబయట
  • పిల్లలకు, కుల/మత సంభందమైన విభేధాలను నేర్పించకండి(కనీసం పాఠశాల వయస్సులో) . ఈ విషయంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది.
  • ఎదుటివారిని కించపరచడాన్ని తమాషాగా కూడా చేయవద్దు/ప్రోత్సహించవద్దు.
  • ఇటువంటి సందర్భాలెదురైనప్పుడు లౌక్యంగా తప్పించుకునే మార్గాలను నేర్పండి/నడచుకోండి.
  • విషమ పరిస్తితుల్లో ఆవేశం కాకుండా ఆలోచనను అలవాటు చేసుకోవటం.
పై మార్గాలు అల్లోపతిలా తక్షణ పరిషారం కాకపోయినా, ఆయుర్వేదంలా దీర్ఘకాలంలో స్థిరమైన ఫలితాలనివ్వగలవు.

తుదిపలుకు: క్షమించటమంటే, అణగారి ఉండటం కాదు, ధైర్యాన్ని ప్రదర్శించి ఆత్మబలాన్ని చూపించి ఎదుటివారికి హాని తలపెట్టకపోవటం.

గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనిచగలరు.

Friday, July 25, 2008

దేవుడు, మనిషి, దెయ్యం - ఏది నిజం

దేవుడున్నాడా అంటే, నేనెప్పుడూ చూడలేదు కానీ, లేదని చెప్పటానికి కూడా ఆస్కారం లేదు. ఉన్నాడనటానికి రుజువులు చూపించడం ఎంత కష్టమో, లేదని చెప్పటానికి(నమ్మించటానికి) అంతకంటే కష్టం. ఏ దేవుడైనా, ఏ మతంలోనైనా మంచికి ప్రతినిధి గానే తారసపడతాడు.కొందరు దేవుడు అనాకారి అని నమ్మితే మరికొందరితో తమ దేవుడు అనంత రూపుడుగా పూజింపబడతాడు. కొందరు ప్రార్థనల ద్వారా దేవుడిని మచ్చిక చేయలని చూస్తే మరికొందరు యఙ్ఞ, యాగాదులు నిర్వహిస్తారు, కానుకలు సమర్పిస్తారు.

దెయ్యన్ని కూడా ఉన్నాడనికాని, లేడనడానికి కాని రుజువులు తేవడం కష్టం. ఏ మతం లోనైనా దెయ్యం సాధారణంగా చెడుకు ప్రతిరూపంగా కనపడతాడు. దేవుడిలాగానే దెయ్యం కూడా అనేక రూపాలుగా ద్వేషించబడతాడు. సాతానుగా, రాక్షసుడుగా, పిశాచంగా అనేక వైవిధ్య అవతారాలతో దేవునితో సమానంగా ప్రాధాన్యత కలిగివుంటాడు.

ఇక మనిషి విషయానికి వస్తే, దేవుడు/దెయ్యం ఉనికికి సంబంధించిన సందిగ్దతని ఆసరా చేసుకుని, తన చుట్టూ ఒక మాయా ప్రపంచాన్ని నిర్మించి జగన్నాటకానికి తెరలేపిన ఒక మహా మేధావి. తన అవసరం కోసం, తనలాంటి ఇతరులను నియంత్రించటం కోసం దేవుడిని, దెయ్యాన్ని అనేక రూపాలలో ప్రతిసృష్టి చేసిన మహానుభావుడు. దేవుని మంచిని దెయ్యపు చెడును తనలో ఇముడ్చుకొని సృష్టి రహస్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్న ఒక శాస్త్రవేత్త. నిజానికి దేవుడు దెయ్యమనేవి మనిషికున్న రెండు పార్శ్వాలేనేమో. ఇతరులకోసం(మనిషికానీ, మరేఇతర ప్రాణీ కాని, మరేవిషయంకోసం కానీ) తన స్వార్థాన్ని లెక్కచేయక జీవించగలిగే వారే దేవుళ్ళు. అన్ని గుణాలనూ ఆదర్శంగా ఆచరించ గలిగినవాడు దేవుడు. కొన్ని లోపాలతో చాలా వరకు సుగుణాలతో ఆవిర్భవించిన మానవులే గతంలో దేవుళ్ళుగా చలామణి అయ్యారు( రాముడు, క్రీస్తు, మహమ్మద్, బుద్దుడు, గురునానక్...). వీరి పేర్లతో అనేక మతాలూ, సాంప్రదాయాలూ ఏర్పడ్డాయి. వాటి లోని కొన్ని లోపాలను ఇతరులు పూరించే ప్రయత్నంలో మరిన్ని జాతులు ఆవిర్భవించాయి. కాలక్రమేణా వీళ్ళు ఒకరినొకరు ద్వేషించుకొని, ఒకరి లోపాలను మరొక్కరు ఎత్తిచూపించి ధూషించి, ధూషించబడి మతవిద్వేషాలకు జాతి వైషమ్యాలకు తెర తీసి తమలోని దెయ్యానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.

మనిషి తను సృష్టించిన మాయలో తనే ఇరుక్కుని దేవుని పేరుతో దెయ్యమై కూర్చున్నాడు. మనిషి దేవుడు కాకపోయినా, సాటి మనిషిని మనిషిగా గుర్థించి వారిలోని గొప్పదనాన్ని నేర్చుకుని, లోపాలను పూరించగలిగితే/మన్నించగలిగితే వసుధైక కుటుంబం ఆవిర్భవిస్తుంది.

Friday, July 18, 2008

అణు ఒప్పందం - శ్వేత పత్రం

ఈ వ్యాసాన్ని వీలయినంతవరకూ అంకెలు, సాంకేతిక పదాలతో నింపకుండా అందరికీ అర్థమయ్యేవిధంగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
అణు ఒప్పంద లాభాలు:
  • అణు ఇంధన సరఫరా కూటమి(NSG) ద్వారా, భారత్ కు ఇంధన సరఫరా.
  • అణు విద్యుత్ ఉత్పాదనకు కావలసిన పరికరాలు.
  • క్రొత్త అణు విద్యుదుద్పాదన కేంద్రాల ఏర్పాటు. తద్వారా కలిగే ఉపాధి అవకాశాలు.
  • అమెరికాతో స్నేహం పెరుగుతుంది(ఇది లాభమా నష్టమా అన్నది మీ అలోచనకే విడిచిపెడుతున్నాను).
అణు ఒప్పంద పరిమితులు:
  • నిరంతర సరఫరాకు హామీ లేదు.
  • సాంకేతిక పరిఙ్ఞాన బదలాయింపు లేదు.
  • పరికరాలను NSG నుంచే కోనుగోలు చేయాలి.
  • మిగిలిన దేశాలతో పొలిస్తే IAEA తనిఖీ పరిధి లోకి వచ్చే కేంద్రాలు భారత్ లో అధికం.
  • భారత దేశానికి అణుశక్తి హోదా లేదు, కనుక రక్షణ పరిశోధలమీద అప్రకటిత నియంత్రణ వర్తిస్తుంది.
  • హైడ్ చట్టం ద్వారా, అమెరికాకు, అణు సరఫరా కూటమిని నియంత్రించే(భారత్ విషయంలో) ఏకపక్ష అధికారం.
అప్రకటిత అంశాలు:

1. భారత్/అమెరికా లు అణు పరీక్షల పై ఎటువంటి హామీ ని ఇవ్వక/పొందక పోయినా, భారత్ కు అణు హోదా ఇవ్వక పోవటం గమనార్హం. ఇది పౌర అణు ఒప్పందం మాత్రమే అని ప్రభుత్వం వాదిస్తోంది. కాని ఇది మనకు అప్రకటిత నైతిక ఆంక్షలను వర్తింప చేస్తుంది.
2. IAEA ముసాయిదాలోని 'దిద్దుబాటు చర్య ' ఏమిటో వివరణ లేదు. ఇది రెండువైపులా అపోహలకు తావిచ్చే అంశం.
3. మన దేశం లోని ధోరియం నిల్వలను వినియోగించేందుకు పరిశొధనలు జరుగుతున్న సమయంలో, అనేక సంక్లిష్టతలతో కూడిన యురేనియం దిగుమతికి ఇంత తొందర అవసరమా? యురేనియం దిగుమతికి కొన్ని వేల కోట్లు పెట్టుబడి, మన దేశీయ పరిశోధనలపై వెచ్చించే మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
4. మన ప్రభుత్వ అత్యుత్సాహం and over optimism.

పరిశీలనాంశాలు:

ఈ ఒప్పంద విషయంలో అమెరికా కనబరుస్తున్న అమితాశక్తిని, మన నేతలు (ముఖ్యంగా మన్మోహన్ గారు) ఎంతవరకు అర్థం చేసుకున్నారు. అమెరికాకు వేల కోట్ల డాలర్ల వాణిజ్య ప్రయోజలే ప్రాతిపదిక ఐతే పెద్ద నష్టం లేదు కానీ, దీన్ని అవకాశంగా రాజకీయంగా మనల్ని కట్టడి చేయాలని చూస్తే మనం ఎంతవరకూ సన్నద్దంగా వున్నాం?

ఎన్నో దేశాలకు అవసరార్థం సహాయం చేసి, వారిని రాజకీయంగా తన కను సన్నల్లో నడిపించుకున్న,నడిపించుకుంటున్న అమెరికాను మనం ఎంతవరకూ విశ్వసించగలం?

అణు ఒప్పందం లాంటి కీలక విషయాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేసి రాజకీయ పరిణామాలను చర్చించి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించి వుండవచ్చు. ఎన్నో విషయాలలో ఇటువంటివి జరిగాయి. వామపక్షాలను వదిలేస్తే, ప్రతిపక్షం కూడా ఒప్పదాన్ని పూర్తిగా వ్యతిరేకించక పోవడం ఇక్కడ గమనార్హం. అలాగే ఒబామా బుష్ కు మద్దతు తెలపడం విశేషం.

ఇక మన్మోహన్ గారి విషయానికొస్తే, దేశ భక్తి, నిబద్దత విషయంలో శంకించక పోయినా, రాజకీయ పరిణితి లోపించిందని అనుమానంగా వుంది. సోనియా సహాయం లేకుండా కాంగ్రెస్ రాజకీయాలనే అర్థం చేసుకోలేని ఆయన, బుష్ చూపిన కొద్దిపాటి సాన్నిహిత్యానికే ఆయనను మంచి నేతగా మన శ్రేయోభిలాషిగా ఒకానొక సందర్భంలో కొనియాడారు. తనపై వస్తున్న అసమర్థ ప్రధాని అనే మచ్చను చెరిపేసుకోవటానికి ఆయన మొండిగా దీనికోసం ఎగబడితే మాత్రం మన పూర్వపు నేతల కష్టంతో పాటు, భవిష్యత్తు నాశనమవుతుంది.

మనం కోరగలిగిన సవరణలు:

1. ఆణుశక్తి దేశాలకు వర్తించే నియమాలను పొందుపరచటం(ఇది చాలా కష్టం).
2. హైడ్ ఒప్పందంలోని ఏకపక్ష నియమాలకు తెరవేయటం.
3. మన పౌర, రక్షణకు సంభందించిన అణు పరిశొధనలపై నిర్ధిష్ట హామీని పొందటం.

Monday, July 14, 2008

భారత దేశం : పెళ్ళి- ప్రాతిపదిక

కొంతకాలంగా బ్లాగు లోకంలో భారతీయ (వివాహ) వ్యవస్థపై చాల విసుర్లు వినిపిస్తున్నాయి.
ఏన్నో విషయాలు చర్చకు వచ్చినా, భారత దేశంలో పెళ్ళికోసం ఎంచుకున్న ప్రాతిపదిక తప్పన్నట్లుగా ఇటివల ఒక ప్రముఖ బ్లాగావధానిగారు (విసురు కాదు సుమా!) అభిప్రాయపడటం నా దృష్టిని ఆకర్షించింది. వాటికి చాల ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడో చిన్న సందేహం నా మెదడును తొలచి నా మొదటి బ్లాగుకు ప్రేరణ అయింది. సదరు బ్లగావధానిగారి, చర్చ లోని కొంత సమాచారాన్ని వినియోగిస్తూ ఈ టపా కొనసాగిస్తాను. అన్యధా భావించక నా సాహసాన్ని ఆశీర్వదించ మనవి.
ఇక విషయానికి వస్తే, పెళ్ళికి ప్రధాన ప్రాతిపదికలుగా మూడింటిని ప్రస్తావించారు. 1. పరువు-ప్రతిష్ట 2. ఈడూ-జోడూ 3.డబ్బూ-దస్కం. నిజానికి ఇవేమీ అంత అనవసరపు విషయాలు కావు. మన పెద్దలు బాగానే అలోచించి ఏర్పాటు చేసిన ఒక విధానం. ఎవరైనా గుండెలమీద చెయ్యి వేసుకుని పెళ్ళికి పై మూడు ప్రాతిపదికలూ అనవసరమని చెప్పగలరా? సమస్యంతా వాటిని వక్రీకరించి(మన కోర్టు చట్టాల వలే) అమలు చేయటంలోనే వుంది.
1. పరువు-ప్రతిష్ట:
ఒక అమ్మాయిని, అబ్బాయిని ముడి పెడుతునపుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం వారిద్దరి జీవితంతో పాటు రెండు కుటుంబాల భవితవ్యం నిర్ణయించబడుతాయి. ఇరువురూ గత చరిత్రలను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. గత చరిత్ర భవిష్యత్తు ప్రవర్తనకు వర్తిస్తుందా అని ఎవరికైనా సందేహం రావచ్చు. కాని గత చరిత్రను పరిశిలిస్తే:), అధిక శాతం అలాగే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి కట్టుబాట్ల వల్ల ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో జాగ్రత్తగా ఉంటూ, ఎదైనా తప్పు చేయవలసి వచ్చినపుడు తమ భవిష్యత్తు గురించీ, తమ కుటుంబ/వంశ పరువు గురించీ ఒక్కసారయినా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన సంప్రదాయమది. గతంలో మన సమాజం చిన్నదవటం (జనాభాలో), అందరూ ఈ సూత్రానికి కట్టుబడి ఉండటం వల్ల, అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాలూ, బేరీజు వేసుకునే అవకాశం వుండేది. సమకాలీన ప్రపంచంలో ఈ కట్టుబాటును యధాతథంగా అనుసరించకుండా కాలానుగుణంగా జరిగిన పరిణామాలకు విలువనిస్తూ సందర్భానుసారం మూల కారణాన్ని అన్వయించుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు.
2. ఈడూ-జోడూ:
ఈడూ-జోడూ అంటే రూప లావణ్యాలనుకుంటే నిజంగా ఇది ఒక ప్రహసనమే. ఇవి కాలంతో బాటుగా క్షీణించే/అంతరించే విశేషణాలు. ఇక మనసు, ప్రవర్తన, గుణ గణాలు బేరీజు వేసుకుంటే, లోపాలు లేని మనిషెక్కడ? అసలు ఎదో ఒక లోపం లేని వాడు మనిషేకాదు, ఏ దేవుడో, దయ్యమో(దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళ కోసం) అయుండాలి. ఈడూ, జోడూ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరిని మరొకరు పూరించటమే. వీటికి రూప లావణ్యాలు సరి కుదిరితే పరిపూర్ణమే కానీ అవే పరమార్థమూ కావు, నిర్లక్ష్యం చేయవలసిన అంశమూ కాదు.
3.డబ్బూ-దస్కం:
డబ్బూ, దస్కం కూడా మంచి జీవనానికి అవసరమే. అంగీకరించటానికి ఇష్టపడక పోయినా, కష్టమైనా ఇది నగ్న సత్యం. మనిషి యొక్క గొప్ప ఆవిష్కరణలలో డబ్బు ఒకటి(ఈ పాయింటుపై ఎవరికైనా అభ్యంతరం వుంటే, మరెప్పుడైనా చర్చిద్దాం). కానీ పెళ్ళి తంతులో ఇది కట్నం గానో, కన్యాశుల్కం గానో రూపాంతరం చెందటం దురదృష్టం. పరిస్థితిని బట్టి ఇద్దరి సహజీవనానికి(సంతానంతో సహా) అవసరమయినంత ధనం సంపాదించగల సత్తా ఉందాని సరి చూసుకోవటం ఎంతమాత్రం తప్పు కాదు.
ఖచ్చితంగా ఇవే కాకపొయినా, ఇటువంటి ప్రాతిపదికలతో పాటు, వీటికి అనుసంధానిచబడిన వాటిలో, కొన్ని సందర్భాలలో లోపాలు కనిపించినా, లోపాలు లేకపొయినా పెద్దలు అలోచించి తమ విచక్షణాధికారంతో కొన్ని పెళ్ళిళ్ళను జరపటమో/ఆపటమో చేసేవారు. కొన్ని రహస్యాలను, తద్వారా కలిగే ఇబ్బందులనూ కొన్ని సందర్భాలలో వివరించక, చాల సందర్భాలలో వివరించ లేక(నిరక్షరాస్యత, పరిణితి లేమి లాంటి కారణాలతో), కొన్ని సూత్రాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేయించేవారు. కాల క్రమేణా అసలు వుద్దేశ్యాలు మరుగున పడినా ఇవి సంప్రదాయాలుగా స్థిరపడ్డాయి. చిత్తశుద్ది కలిగిన నాయకులున్న సమాజంలో ఇవి వ్యక్తిగత ఇష్టాలకు విలువనిస్తూ, సమాజహితాన్ని పరిగణలోకి తీసుకుని సరిగ్గానే అన్వయింప బడతాయి.
కాని, కాలగతిన ఇవి దుష్టుల(అధికారం, బలం, దౌర్జన్యం లాంటివి) పాలబడి వక్రీకరించబడి దుస్సంప్రదాయాలుగా పరావర్తనం చెంది ప్రస్తుత రూపంలో చెలామణి అవుతున్నాయి. దీనికి ప్రాతిపదికలను నిందించటం కన్నా (రచయిత యొక్క ఇతర అభిప్రాయలతొ ఏకీభవించినా, ఈ ఒక్క విషయం లోనే విభేదిస్తున్నాను) వాటి అసలు భాష్యాలను గ్రహించి మన పద్దతులను సాన పడితే వజ్రాల్లాంటి మన సంస్కృతి, సంప్రదాయాలు జీవం పోసుకుంటాయనడంలో సందేహం లేదు.
స్వయం సమృద్ది, విద్యార్జన, స్వయం ప్రతిపత్తి, స్వేచ్చ మొదలైన సుగుణాలు కలిగిన మనం (మన ప్రస్తుత భారత సమాజం) కాస్త వివేచనతో పాశ్చాత్య సంస్కృతి లోని కొన్ని జాడ్యాలను వంటపట్టించుకోక మన సంస్కృతి నేర్పిన కట్టుబాట్లకు గౌరవమిస్తూ అవసరమైనప్పుడు సమీక్షిస్తూ ముందుకు పోతే మనం మనిషి భవిష్యత్తుకు అద్వితీయమైన వారధి కావచ్చు.
గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనిచగలరు.
ఈ టపాలో ఉదరహరించబదిన టపాకు లంకె: http://parnashaala.blogspot.com/2008/07/blog-post_11.html